Komali Prasad : ‘నేను సీతాదేవి’ అనే సినిమాతో టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలీ ప్రసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు నటించినప్పటికీ అమ్మడికి అంత గుర్తింపు రాలేదు. ‘హిట్ 2’ సినిమాతో ఫామ్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ‘శశి వదనే’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఇక ఏప్రిల్ 19న ఈ మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది. తాజాగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఈ బ్యూటీ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావన్న విషయం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మన దర్శక నిర్మాతలు టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిల కోసం నిత్యం వెతుకుతున్నారు. అవకాశం ఉన్న ప్రతి సినిమాల్లోనూ ఇక్కడి అమ్మాయిలనే తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను తెలుగు అమ్మాయినే అయినప్పటికీ.. నువ్వు ముంబై నుంచి వచ్చావు కదా? నువ్వు తెలుగు అమ్మాయివి అని ఎక్కడ చెప్పకు. అవకాశాలు రావని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నేను అలా ఎప్పుడు చెయ్యలేదు. తెలుగు అమ్మాయిని అనే చెప్పా. నాకు వచ్చిన అవకాశాలన్నీ కూడా తెలుగు అమ్మాయిని కాబట్టే వచ్చాయి. సినిమాల కోసం అమ్మను మార్చలేం కదా’ అంటూ కోమలి చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా తన ప్రేమ కథ గురించి చెబుతూ.. ‘అందరిలాగే నేను కూడా ఓ వ్యక్తిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల మా ఇద్దరికి బ్రేకప్ అయింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉంటున్నాను. ఇక పద్ధతిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న. రోజుకు రెండు జోకులు, ఒక పూట బిర్యాని తినిపించే వాడు భర్తగా రావాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ క్రేజీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.