Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్బాబు ఎవరికి వారే ప్రత్యేకమైనవారు. ఇద్దరిదీ సుదీర్ఘ సినీ ప్రయాణం. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, గొడవలు పడుతుంటారన్న వార్తలు కూడా ఉన్నాయి. పలుమార్లు బాహాటంగానే ఈ విషయం వెల్లడైంది కూడా. అయితే, ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ స్టేజీపై కనిపించడం, అందరూ అనుకుంటున్నట్టు తమ మధ్య విభేదాలేవీ లేవని చెప్పడం పరిపాటిగా మారింది. ఇదే విషయమై మోహన్బాబు తనయుడు మంచు మనోజ్ మరోమారు స్పష్టతనిచ్చారు.
చిరంజీవి, మోహన్బాబు టామ్ అండ్ జెర్రీ లాంటి వారని, గొడవ పడుతూ కలిసిపోతుంటారని చెప్పారు. వారిద్దరిదీ 45 ఏళ్ల బంధమని పేర్కొన్నారు. రాంచరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిన్న హైదరాబాద్లో వేడుకలు నిర్వహించారు. దీనికి మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం, దర్శకులు బుచ్చిబాబు, బాబీతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. రాంచరణ్ తనకు ప్రాణ స్నేహితుడని అన్నారు. చరణ్ మంచి నటుడు మాత్రమే కాదని, అంతకుమించిన గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోతారని చెబుతూ ఓ విషయం గురించి వెల్లడించారు.చెర్రీ స్నేహానికి విలువనిస్తాడని, బాల్య మిత్రులతో ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటాడని చెప్పుకొచ్చారు. ఓసారి తనతో ఓ వ్యక్తి మాట్లాడుతూ..
‘మీ నాన్న, చెర్రీ నాన్న గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారు కదా.. మీ ఇద్దరూ ఇంతకాలంగా ఎలా స్నేహితులుగా ఉండగలిగారు?’ అని అడిగాడరని, దానికి తాను.. భార్యాభర్తల విషయాల్లో కలగజేసుకునే వ్యక్తిని ఏమంటారో తెలుసా? అని ప్రశ్నించానని చెప్పారు. వాళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీలాంటివారని, గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారని, ఇద్దరిదీ 45 ఏళ్ల బంధమని, తమలాగే వాళ్లిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.