Ram Charan : పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఇప్పటికే ప్రారంభమైపోయాయి. మార్చి 27వ తేదీన ఆయన పుట్టినరోజు కాగా సుమారు నెల రోజుల ముందు నుంచి అభిమానులు రకరకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయన పుట్టిన రోజుని విభిన్నంగా జరుపుకుంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ తల్లి సురేఖ ఈ ఏడాది ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఆమె స్వయంగా 500 మందికి వంట చేసి అన్నదానం నిర్వహించారు. రామ్ చరణ్ భార్య ఉపాసన తన అత్తమ్మ సురేఖ చేత అత్తమ్మాస్ కిచెన్ అనే ఒక బిజినెస్ ప్రారంభింపజేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ బిజినెస్ కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. రాంచరణ్ పుట్టిన రోజుకు ముందే అపోలో హాస్పిటల్స్ లో ఉన్న దేవాలయం పుష్కరోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 500 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో వారందరికీ సురేఖ తన స్వహస్తాలతో వండిన వంటలను తన కోడలు ఉపాసన చేతుల మీదుగా వడ్డింప చేసి దైవ కార్యక్రమానికి వచ్చిన వారందరి కడుపునింపారు. ఇక ఈ మేరకు ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. దాంతో పాటు బుచ్చిబాబు సినిమా, సుకుమార్ సినిమాలకు సంబంధించిన ఏవైనా అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.