Rashmika And Vijay : నిత్యం సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్తూ వార్తల్లో నిలుస్తుంటారు వేణు స్వామి. పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు ఆయన దగ్గర పూజలు చేయించుకుంటారు. ఆయన చెప్పే చాలా విషయాలు సెన్సేషనల్ గా మారుతుంటాయి. నాగ చైతన్య, సమంత ప్రేమ, విడాకుల గురించి ఆయన చెప్పిన మాటలు నిజం కావడంతో బాగా పాపులర్ అయ్యారు. అయితే, రీసెంట్ గా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం చెప్పారు.

కానీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలైంది. సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. మరోవైపు ప్రభాస్ గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయ్యాయి. ‘బాహుబలి‘ తర్వాత డార్లింగ్ కు సినీ కెరీర్ లేదని వ్యాఖ్యానించారు. కానీ, ఆయన తాజా చిత్రం ‘సలార్‘ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. ఆయన చెప్పే ముచ్చట్లన్నీ ఉత్తి కట్టుకథలుగా కొట్టిపారేస్తున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు పెళ్లితో ఒక్కటవుతారని చెప్పారు.

కానీ, వివాహం తర్వాత వీళ్లు విడిపోతారని చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే రష్మికకు చెప్పినట్లు వెల్లడించారు. విజయ్ ని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని సూచించినట్లు వివరించారు. కానీ, తన మాటలు రష్మికకు అస్సలు నచ్చలేదన్నారు. అప్పటి వరకు తన మీద నమ్మకంతో చెప్పిన పూజలు, పరిహారాలు చేసిన రష్మిక, ఈ విషయం చెప్పిన తర్వాత మాట్లాడ్డం మానేసిందన్నారు. తాను కూడా వారి గురించి పట్టించుకోవడం మానేసినట్లు వెల్లడించారు. రష్మిక, విజయ్ గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.