Hanuman Movie : సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా అరుదైన రికార్డు నెలకొల్పింది. ‘సంక్రాంతి సీజన్లో రిలీజైన సినిమాల జాబితా’లో.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నంబరు 1గా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోస్టర్ను పంచుకుంది.

‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమతో ‘హనుమాన్’ చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల టాలీవుడ్ ప్రస్థానంలో ఆల్టైమ్ సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచింది’’ అని పేర్కొంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 278 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘జై హనుమాన్’ రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు. ‘‘ఆన్స్క్రీన్తో పాటు, ఆఫ్ స్క్రీన్లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండొచ్చు’’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాముడిగా తన మనసులో ఉన్న నటుడు మహేశ్బాబు అని, సోషల్ మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశానని, తమ ఆఫీస్లో కూడా రాముడి పాత్రను మహేశ్ ముఖంతో రీక్రియేట్ చేసి చూశామని అన్నారు. పార్ట్ 1లో నటించిన తేజ కూడా పార్ట్ 2లో కనిపిస్తారు. ఓ సందర్భంలో.. ‘హనుమాన్’లోని హనుమంతుడి ఎంట్రీ సీన్ గురించి డైరెక్టర్ చెప్పిన మాటలు వైరలవుతున్నాయి. ఆ సన్నివేశాన్ని అయోధ్య బ్యాక్డ్రాప్లో తీయాలని అనుకున్నారట. ‘ఒక పాప రామ మందిరంలో దీపాలు వెలిగించాలని చూస్తుంటుంది.. కానీ గాలి కారణంగా అవి వెలగవు. అదే సమయానికి మందిరం పైనుంచి హనుమాన్ వెళ్లగానే.. ఆ దీపాలు వాటికవే వెలుగుతాయి. ఇలా రాసుకున్న సీన్ కొన్ని కారణల వల్ల మార్చాల్సి వచ్చింది’ అని చెప్పారు.