Sreeleela : గుంటూరు కారం గురించి వచ్చిన విమర్శలపై నిర్మాత నాగవంశీ చాలా రోజులుగా సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా గట్టిగానే మాట్లాడుతున్నారు. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాలోని లాజిక్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా గుంటూరు కారంలోని గుంటూరు టు హైదరాబాద్ జర్నీకి సంబంధించిన టోల్స్కు కౌంటర్ ఇచ్చారు.
సినిమాలో హీరో గుంటూరు నుంచి హైదరాబాద్కు మాటిమాటికి వెళుతున్నాడని సోషల్ మీడియాలో వెటకారం చేస్తున్నారని నాగవంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని లాజికల్గా చెప్పేందుకు సినిమాలో మూడున్నర గంటల మొత్తం ప్రయాణం చూపించాలా.. లేకపోతే మధ్యమధ్యలో టీ తాగడం చూపించాలా అని స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. “అన్నిసార్లు హీరో మాటిమాటికి గుంటూరు నుంచి హైదరాబాద్.. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నాడు అంటున్నారు.. ఇప్పుడు ఏంటి.. గుంటూరు నుంచి హైదరాబాద్కు మూడు గంటల జర్నీ చేస్తే అందంతా సినిమాలు చూపించాలంటారా.. లేక మధ్యలో టీ షాప్ దగ్గర తాగడం చూపించాలా?” అన్నారు.
సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాల్లో మాస్ పాటల్లో మహేశ్ బాబు ఇరగదీశారని.. అందుకే వాటిని మించి ఉండాలన్న ఉద్దేశంతో గుంటూరు కారంలో కుర్చీని మడతపెట్టి సాంగ్ పెట్టామని నాగవంశీ వివరించారు. మహేశ్ మాస్ డ్యాన్స్ అభిమానులను బాగా అలరించిందని అన్నారు. ఆ సమయంలో శ్రీలీల అక్కడకు ఎలా వచ్చింది.. చీర అంత తక్కువ సమయంలో ఎలా మార్చుకుంది అని లాజిక్ లు మాట్లాడకూడదని మండిపడ్డారు. అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు సినిమాలు తీస్తామని, పెద్ద సినిమాల్లో ప్రతీ చోట లాజిక్లను వెతకడం సరికాదని ఆయన అన్నారు.