Avanthika Vandanap : బాలనటిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఇప్పుడు హాలీవుడ్లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. తాజాగా ఆమె ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోల్స్పై స్పందించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అవంతిక ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..
‘ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇది నా పనికి మాత్రమే వచ్చినది కాదు. సరిహద్దులు దాటి లభించిన అభిమానానికి ఇచ్చినది. గ్లోబల్ సినిమాలో ఇండియా భాగం కావడం వల్ల వచ్చిన ఈ అవార్డు మరింత విలువనిచ్చింది. నేను హాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చాలామంది విమర్శించారు. అప్పుడు చాలా బాధేసింది. ఏది చెప్పినా.. పాజిటివ్ గానే చెప్పాను. అది అర్థం చేసుకోకుండా అందరూ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడాక విమర్శించారు. నేను అలాంటివారిని పట్టించుకోను’ అని చెప్పింది.
దీంతో అవంతిక స్పీచ్ వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు ఆమెకు అభినందనలు చెబుతున్నారు. 2014లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డ్యాన్స్ కార్యక్రమంలో అవంతిక రెండో విజేతగా నిలిచింది. దీంతో ఆమెకు ‘బ్రహ్మోత్సవం’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బాలకృష్ణుడు’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో నటించింది.