ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థి ఇటీవల రూపాలీ బారువాను రెండో పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. ఆయన తన మొదటి భార్య, నటి రాజోషి(పిలూ)కి గత ఏడాది విడాకులు ఇచ్చారు. ఆ తర్వాతే రూపాలిని ప్రేమించారు. ఆశీష్, పిలూలకు అర్థ్ అనే కొడుకున్నాడు. కొడుకు విషయంలో వారు గర్వపడుతుంటారు. ఇదిలావుండగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తానెందుకు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో ఆశీష్ వివరించారు.

తన మొదటి భార్య రాజోషితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఆ విషయాన్ని అబ్బాయి ఆర్త్ తో చెప్పడానికి చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. ఆ విషయాన్ని తనకు చెప్పడానికి ఎంతో కష్టపడినట్లు వెల్లడించారు. “చాలా గిల్టీగా అనిపించించింది. నేను, పిలూ(రాజోషి) ఇద్దరూ అతడికి ఇలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకోలేదు. మేము ఇద్దరం కొంత కాలంగా గొడవలతో ప్రయాణం చేశాం. కలిసి ఉండటం వల్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుందని భావించాం.

అది మా ఇద్దరి జీవితాలతో పాటు అబ్బాయి ఆర్త్ మీద కూడా బాగా ప్రభావం చూపుతుందని నిర్ణయానికి వచ్చాం. పేరెంట్స్ చాలా గొడవలతో ఇబ్బంది పడుతున్నారు అనే విషయం ఆర్త్ కు కూడా తెలుసు. ఒక్కోసారి పరిస్థితి ముదిరేకొద్ది తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటూ కొట్లాడుకోవడం కంటే, విడిపోయి సుఖంగా ఉండటం మంచిది అనుకున్నాం. మా మూలంగా అబ్బాయి జీవితం చెడిపోకూడదు అనుకున్నాం. ఇదే విషయాన్ని అబ్బాయికి చెప్పాం. విడిపోతున్నామని తనకు అర్థం అయ్యేలా వివరించాం. అతడు కూడా మా నిర్ణయానికి అంగీరం చెప్పాడు” అని ఆశిష్ చెప్పుకొచ్చారు.