Comedian Ali : ఇండస్ట్రీలో డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కమెడియన్ అలీల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిది విడదీయరాని బంధం. పూరి తీసిన ప్రతి సినిమాలో అలీకి ప్రత్యేక పాత్ర కచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ సినిమాల్లోని పాత్రలు అలీకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆస్తులన్నీ అమ్మేసి నడిబజారులో నిలబడిన సమయంలో పూరి జగన్నాథ్కు రూ.లక్షలు విలువ చేసే బంగారం గొలుసు ఇచ్చి ఇది దగ్గరుంటే పోయినవన్నీ తిరిగొస్తాయని చెప్పారు కమెడియన్ అలీ. ఆయన చెప్పినట్లే పూరి జగన్నాథ్ తిరిగి ఇండస్ట్రీలో మళ్లీ నిలదొక్కుకున్నారు. తాను సంతోషంగా ఉంటే ఒక బొకే.. బాధలో ఉన్నప్పుడు ఒక పెగ్ మందు అలీ పోసి వెళ్తాడని పూరీ జగన్నాథ్ చెబుతారు.
ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా ఈవెంట్కు హాజరైన నేపథ్యంలో పూరి జగన్నాథ్పై కమెడియన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలీ మాట్లాడుతూ థాయ్లాండ్ ఓ రాజ్యం కాబట్టి సరిపోయింది కానీ అక్కడ కనుక ఎన్నికలు పెడితే పూరి జగన్నాథ్ సీఎం .. తాను హోం మినిస్టర్ అవుతామని వ్యాఖ్యానించారు. అయితే అలీ ఈ మాటలు అనడం వెనుక కారణం ఒకటి ఉంది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్కి కష్టం అనిపించినా, మూడీగా ఉన్నా వెంటనే థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్లిపోతారు. అక్కడ బీచ్లలో కూర్చొని కథలు రాసుకోవడం ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు. తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలైనా బ్యాంకాక్లో షూట్ చేయాల్సిందే. అంతేకాదు తనకు బ్యాంకాక్లో అభిమానులు ఉన్నారని, అక్కడ పోటీ చేసినా గెలుస్తానని పూరి జగన్నాథ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. బ్యాంకాక్ బీచ్లలో చూపు తిప్పుకోకుండా ఉండలేమని, అలాంటి చోట స్క్రిప్ట్ రాయడం కష్టమని.. కానీ ఆ ప్రదేశాల్లో ఉంటేనే మన ఏకాగ్రత ఎంతో తెలుస్తుందంటూ పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఆయనతో స్నేహామో ఏమో కానీ అలీ కూడా థాయ్లాండ్ ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.