Kareena Kapoor : బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పుస్తకం రాసిన నటి కరీనాపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుక్ టైటిల్లో బైబిల్ అన్న పదాన్ని వాడడాన్ని తప్పుపడుతూ ఓ అడ్వకేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. అంతకుముందు, అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో పిటిషన్ను తిరస్కరించింది. ఆ తర్వాత న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ హైకోర్టులో ఈ ఉత్తర్వులను సవాలు చేశారు.
కరీనా కపూర్కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. క్రైస్తవ సమాజం మనోభావాలను దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తకంలో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించి క్రైస్తవ సమాజం మనోభావాలను దెబ్బతీసినందుకు కరీనాకపూర్పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. క్రైస్తవులకు బైబిల్ చాలా పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్తో పోల్చడం సరికాదు అని ఆ పిటీషన్లో పేర్కొన్నారు. తన పుస్తకానికి పాపులారిటీ తీసుకువచ్చేందుకు నటి కరీనా ఆ పదాన్ని వాడినట్లు ఆంథోనీ ఆరోపించారు. 2021లో ఈ బుక్ను పబ్లిష్ చేశారు.
పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించడంతో.. న్యాయవాది మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఇదే విధమైన కేసును కోరుతూ ప్రైవేట్ ఫిర్యాదును దాఖలు చేశారు. అయితే, ‘బైబిల్’ అనే పదాన్ని ఉపయోగించడం క్రైస్తవ సమాజం మనోభావాలను ఎలా దెబ్బతీసిందో నిర్ధారించడంలో ఫిర్యాదుదారు విఫలమయ్యారనే కారణంతో మెజిస్ట్రేట్ కోర్టు పిటిషన్ను కూడా కొట్టివేసింది. దీని తర్వాత అతను అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. అది కూడా ఎటువంటి ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.